ఒకప్పుడు గోధుమ మొక్కలు నానారకాల చెత్తమొక్కల మధ్య పెరిగేవి. ఏదో మధ్యప్రాచ్యంలో కొన్నిచోట్ల తప్ప ఇంకెక్కడా మచ్చుకైనా కనిపించేవికాదు. అలాంటిది ఈనాడు గోధుమసాగు ఏకంగా 2,52,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సాగుతోంది. ఈ వైశాల్యం బ్రిటన్ వైశాల్యానికి పది రెట్లు! ఒకప్పుడు చక్కగా వేటాడి, ఇంటికొచ్చి వినోదించిన ఆదిమ మానవులు, ఈ గోధుమ మోజులోపడ్డాక దానికి ఎక్కువ సమయం వెచ్చించడం మొదలుపెట్టారు. గోధుమ మొక్కలుంగారికి రాళ్ళంటే అసహ్యం. మనుషులు తమ వీపులు విరగ్గొట్టుకొని (మనుషుల వెన్నుపూసలు చెట్లెక్కడానికీ, పరిగెత్తడానికీ ఉద్దేశ్యించబడినవేగానీ, రాళ్ళుకొట్టడానికీ, బకెట్లతో నీళ్లుమొయ్యడానికీ ఉద్దేశ్యించినవి కావుట) నేలను చదునుచేసి, మొక్కలుంగారిని పెంచడానికి తంటాలుపడ్డారు. గోధుమమొక్కలుంగారికి ఇతర మొక్కల పొడ గిట్టదు. వారు ఇతరులతో తమ నీళ్లను, సారఖనిజాలనూ పంచుకోవడానికి ఇష్టపడరు. వాటిని ప్రత్యేకంగా పొలల్లో పెంచడానికి మనుషులు తయార్! మొక్కలుంగారికి జబ్బుచేస్తే, వాటికి పురుగు ఆశిస్తే మనుషులే కిందామీదా ఐపోయారు. మొక్కలుంగారికి దాహం వేస్తే బక్కెట్లతో నీళ్ళు పోశారు. మొక్కలుంగారిని మిడతలనుంచీ, కుందేళ్ళనుంచే రక్షించారు. అలా మొక్కలుంగారిని కంటికి రెప్పలా కాపాడుకోవడంకోసం ఆఖరికి పొలాలప్రక్కనే ఇళ్ళుకట్టుకొని నివశించడంకూడా మొదలుపెట్టారు (మనం దాన్నేదో డొమెస్టికేటు చేసుకున్నాం అని గొప్పలు చెప్పుకుంటాం. అదే మనల్ను డొమెస్టికేటు చేసుకొని. దానికి నచ్చినట్లు మనల్ని ఆడించింది). మొక్కలుంగారికి ఆకలివేస్తే పశువుల పెంటను ఎరువుగా వేశారు. ఒకప్పుడు దాని పొడ కూడ సోకని నేలల్లో, నేడు వందల ఎకరాల్లో అతి ముద్దుగా చూసుకుంటున్నారు.
ఇంతచేసి గోధుమ గింజలు అంత గొప్పవా? ఒకప్పుడు మనిషి అన్నిరకాల ఆహారాల్నీ తినేవాడు. వాటన్నింటితో పోల్చినప్పుడు అంత గొప్ప ప్రోటిన్లనీ, విటమిన్లనీ గోధుమలు ఇవ్వవు. అవి నాసిరకం ఆహారం. గింజలు తినడం మనుషులకు కొత్త విషయం. గోధుమలు తినడంవల్ల పళ్ళు, చిగుళ్ళు త్వరగా పాడయ్యేవి. మరి గోధుమ మనుషులకు ఏమిచ్చింది? ఆర్ధిక స్థిరత్వం? లేదు. అన్ని మొక్కలమీద ఆధారపడడం మానేసి, ఈ ఒక్కదానిమీదే ఆధారపడడం వల్ల, ఎప్పుడైనా వర్షాలు కురవక గోధుమలు పండకపోతే, రైతులు మూకుమ్మడిగా అత్మహత్యలు చేసుకొనేవాళ్ళు. హింసకు వ్యతిరేకంగా రక్షణ? ఏమాత్రంకూడా కాదు. ఒకప్పుడు మనుషులు ద్రిమ్మరులు. పొలం అనే ఒక స్తిరాస్థి ఏర్పడ్డంవల్ల తమ తండాలను రక్తమోడైనా రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరి ఎందుకు గోధుమల మోహంలో మనుషులు మునిగితేలారు?
గోధుమలు నాసి రకం ఆహారమైతే అయ్యుండొచ్చుగాక. తక్కువ ఖర్చుతో ఎక్కువమంది కడుపు నిండాలంటే గోధుమలేగతి. ఒకజాతి అంతరించిపోకుండా ఉండటం అంటే ఆజాతి DNA ఉనికిలో ఉండటం. ఎలాగైతే ఒక కంపెనీ తన బ్యాంకుఖాతాలోని డబ్బుగురించేగానీ, తన ఉద్యోగుల ఆనందాన్నిగురించి ఆలోచించదో. అలాగే తొలినాటి నాగరికతలు ఆకలిచావులను దూరంగా ఉంచాలంటే గోధుమలే ఆయా నాగరికతలకు శరణ్యం. వాటి ప్రధాన ధ్యేయం మనుషులను సుఖంగా, పుష్టిగా ఉంచడంకాదు. వారి DNA అంతరించిపోకుండా చూసుకోవడమ్మాత్రమే! ఆవిధంగా 12,000 సంవత్సరాల క్రింతం మొదలైన వ్యవసాయ విప్లవ సూత్రం: నాసి రకం తిండైనా తిని, జాతిని వినాశనం నుంచి రక్షించుకో!

